Sunday, April 26, 2015

http://www.andhrajyothy.com/Artical.aspx?SID=108261&SupID=26







థ రాయడం.. నెమలికంఠం రంగు నేత (11-May-2015)

జగమెరిగిన తల్లావజ్జల పతంజలిశాస్ర్తికి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తెలుగుసాహిత్యరంగంలో ఈ నామధేయం ఒక్కటి సరిపోతుంది. అటువంటి సారస్వత పరంపర ఆయనది. నవ్య సాహిత్యపరిషత్తు సభాపతి శివశంకరశాస్ర్తి ఆయన పితామహుడు. బారిష్టరు పార్వతీశం సృష్టికర్త మొక్కపాటి నరసింహఇమాతామహుడు. సాహితీవేత్త కృత్తివాసతీర్థులు తండ్రి.
ఈ నేపథ్యంలో ఒక ఆకుపచ్చని పార్శ్వం కోసం రచయితగా, పర్యావరణవేత్తగా పతంజలిశాస్ర్తి నిరంతర కృషీవలుడు. ‘గుండెగోదారి’ కవిత్వ సంపుటం; ‘వడ్ల చిలకలు’, ‘పతంజలిశాస్ర్తి కథలు’, ‘నలుపెరుపు’ కథా సంకలనాలు; ‘హోరు’, ‘దేవరకోటేశు’, ‘వీరనాయకుడు’ నవలలు; ‘మాధవి’ నాటకం ఆయన ప్రధాన రచనలు. ‘ఎర్రవాని ఇల్లు’, ‘బ్రహ్మకేశాలు’ అనువాదగ్రంథాలు. జీవావరణ విధ్వంసంపై అనేక వ్యాసాలు రాసిన శాస్ర్తికి నాటకం, సినిమా, సంగీత కళలు అభిమానం. పర్యావరణరంగం కార్యక్షేత్రం. అర్ధ శతాబ్దంగా అక్షరయాత్ర సాగిస్తున్న శాస్ర్తి రచనలు ఎంత హృద్యమైనవో అంతకు మిక్కిలి ఆలోచనాత్మకమైనవి. క్లుప్తత, గాఢత, విలక్షణశైలితో ఆయన ఓ నూతన తరహా కథకుడిగా స్థిరపడ్డారు. భావనా సౌందర్యం, భాషా మాధుర్యం, తాత్విక దృక్పథంతో పాటు సమకాలీన వాస్తవికతను విస్మరించని నవలాకారుడిగా గుర్తింపుపొందారు.
సాహిత్యమే తనని బతికిస్తోందని ప్రకటించుకొనే శాస్ర్తిగారిని మీరు ఎప్పుడైనా చూశారా? నీరెండవేళ గలగల సెలయేటి చెంతన వెదురుపొదలాగ ఉంటారు. ఆయన మాట్లాడగా విన్నారా? జ్ఞాన సముద్రతీరంలో దేశదేశాల సంగతులు కొన్ని వినిపించీ, మరికొన్ని హోరుగాలిలో కలిసిపోతున్నట్టుంటుంది. పతంజలిశాస్ర్తికి ఈ నెల 14న డెబ్బయ్యవ పుట్టినరోజు.

పూర్వ కవులు, రచయితలలో మిమ్మల్ని ప్రభావితం చేసిన వారెవరు?
నామీద ఎవరి ప్రభావమూ లేదు. నచ్చినవారు అనేకులు. కానీ మిత్రలాభం, మిత్రభేదం నన్ను ఒక రకంగా ప్రభావితం చేశాయని చెప్పాలి. ఒక చిన్న విషయం నొబకోవ్‌ వల్ల తెలుసుకున్నాను. హరూకేముర కామీ కథలు ఇష్టం.
ఈ డెబ్బయ్యేళ్లలో మీ మనసుకు నచ్చిన పుస్తకాలేవి?
అనేకం. పెద్ద జాబితా అవుతుంది. వాటిలో మార్క్విస్‌ గార్సియా One Hundred years of solitude ఒకటి. ముఖ్యమైంది. అలాగే Perfume నాకిష్టమైన గొప్ప నవల. ఒకటీ అరా విడదీసి చెప్పలేను. తెలుగులో కొన్ని ఇష్టం. నచ్చడం కాదు. పుస్తకం నిన్ను ఉతికి ఆరెయ్యాలి.
మీరు కొన్నాళ్లు కవిత్వం రాశారు. ‘గుండె గోదారి’ ప్రచురించాక రాయడం మానుకొన్నారు. ఎందుకని?
నిజమే. రాయాలనిపించలేదు. నా కథల మీద నాకున్న గౌరవం నేను రాసిన కొద్దిపాటి కవిత్వం మీద లేదు. రచయితకి తన రచనల మీద గౌరవం ఉండాలి. అది ఎందుకుంటుందంటే, self analysis ఉంటే ఉంటుంది. రాసింది కొంతకాలానికి నచ్చకపోవడం వేరు. ఇదంతాliterary integrity లో భాగం. అది లేకపోతే ఏ బాధా లేదు.

మీకు అత్యంత ఇష్టమైన సాహిత్యప్రక్రియ ఏది?
కథ, నవల. కథ రాయడం కష్టం. క్లుప్తత, గాఢత, understatement మంచికథల లక్షణాలు. నెమలికంఠం రంగు నేతలాంటిది. నా కథలన్నీ పొరలుపొరలుగా ఉంటాయి. నా కథన పద్ధతికి ‘సమాంతర వాస్తవికత’ అని పేరు పెట్టుకున్నాను. వాస్తవానికి కూడా అనేక పార్శ్వాలున్నాయి. నేను ఉపయోగించే ప్రతీకలు కథనంలోంచి వెళ్లుకొచ్చినట్టుండవు. ఇల్లలుకుతూ పేరు మర్చిపోయిన ఈగ కథ, ఓ చేప ఎండని కథ ఎంత సాఫీగా ఉంటాయి? అంటే అన్నీ ఒకేలా ఉండకూడదు. గొప్ప ఆలోచనాత్మకంగా ఉండాలి. హెమింగ్వే 26 వాక్యాల్లో ఓ కథ రాశాడు. అవన్నీ కాదు. ముందసలు కథ చెప్పడం తెలియాలి. అదే కష్టం.
మీ రచనల్లో కథనం సునాయాసంగా నడుస్తోంది. ఆ నేర్పు ఎలా సాధించారు?
అది నేను చెప్పలేను. నేను చదివేటప్పుడు, సినిమా చూసేటప్పుడు కథనం గమనిస్తుంటాను. వస్తువుని బట్టి మెటఫర్‌, భాష మార్చుకోవాలి. నేను రాసేటప్పుడు నా పాత్రలు కళ్లకు కనిపిస్తూంటారు, సినిమాలాగ. వాళ్ల ఒంటిరంగు, క్రాఫింగు, నడక, నవ్వినప్పుడు ఎలా ఉంటారు, గొంతు, ఇదంతా నాకు కనబడుతూ వినిపిస్తూంటుంది. వర్షం, ఎండ, ఉక్క, చలి ఆ ప్రాంతాన్ని బట్టి ఉంటాయి. నేను అది కూడా గమనిస్తాను. నా కథల్లో మనుషులు రచయిత సహాయంతో నడవరు.
వర్తమాన తెలుగు సాహిత్యం ఎలా ఉందంటారు?
బావుంది. ప్రతిభకి మనకి ఎప్పుడూ లోటులేదు. కానీ మనకి సాహిత్య పైరవీకారుల బెడద ఎక్కువ. చెవిదగ్గిర దోమలాంటివాళ్లు. ఒక వర్గాన్ని తయారుచెయ్యడం, సన్మానాలు చేయించుకోవడం, వ్యాసాలు రాయించుకోవడం, పురస్కారాలు ఇవ్వడం, ఇప్పించుకోవడం. క్రోనీ కేపిటలిజం లాగ క్రోనీ లిటరాటీ ఎక్కువగా ఉంటుంది. కానీ భిన్న ప్రాంతాల నుంచీ, అనేక సామాజిక వర్గాల రచనలు రావడం చాలా బాగుంది. అయితే సాహిత్యం ఒక సృజనాత్మక వ్యవహారం అనే స్పృహ కొరవడుతోంది. క్రియేటివిటీ లేనిదే సాహిత్యం కాదు.
సాహిత్య విమర్శ గురించి ఏమంటారు?
మనకి సమర్థులున్నారు గానీ విమర్శ లేకుండా పోయింది. సమర్థులు విమర్శ పనిగా పెట్టుకోవడంలేదు. గోంగూర పచ్చడి నుంచి కవిత్వం వరకూ ఒకళ్లే రాస్తారు. ఏదో ఒక సిద్ధాంతానికి కట్టుబడి చేసే విమర్శ సమగ్రం కాదు. సాహిత్యం అంటే ఇట్లాగే ఉండితీరాలని మతగురువుల్లాగ ఆదేశాలు జారీ చేస్తూంటారు. క్రమంగా మార్పు కూడా వస్తోందిలే. కథకి విమర్శకులు లేరు. పెద్ద సాహిత్యసంస్థలు కూడా సాహిత్యరాజకీయాల వల్ల కలుషితం అయిపోయాయి.
మీ దృష్టిలో సాహిత్యప్రయోజనం ఏమిటి?
ప్రయోజనాలకి అతీతమైనది సృజనాత్మక సాహిత్యం. ప్రయోజనానికి మనం ఇచ్చే అర్థాన్ని బట్టి కూడా ఉంటుంది. ఏదో ఒక భౌతిక ప్రయోజనం కోసం సాహిత్యం కంటే కరపత్రాలు, వ్యాసం, ఒక రకమైన నాటకాలు చాలు. అంటే సమకాలీన వాస్తవికతను విస్మరించమని అర్థం కాదు. సాహిత్యం ఎప్పుడూ ఉద్యమాలకి స్ఫూర్తినిస్తూనే ఉంటుంది. సాహిత్యం అవడం అనేది రచయిత సృజనాత్మక ప్రతిభమీద, విశాల ప్రాపంచిక దృక్పథం మీదా ఆధారపడి ఉంటుంది. తెలుగులో దీన్ని గురించి మాట్లాడ్డం వ్యర్థం. దక్షిణ అమెరికా సాహిత్యం నేనన్నదానికి గొప్ప ఉదాహరణ. స్థలకాలాదుల పరిమితుల్ని అధిగమించిన సాహిత్యం అది. ‘అతడు అడవిని జయించాడు’ లాగ. లాటిన్‌అమెరికన్‌ రచయితలు వారి folk metaphor ని అద్భుతంగా ఉపయోగించుకున్నారు. సాహిత్యం సకల మానవానుభవాల్ని నీవి చేస్తుంది. చింతనా శీలుణ్ని చేస్తుంది. జీవితాల్ని నిర్వచించి నీకు కొత్త చూపుని ప్రసాదిస్తుంది. మొదటి అంతస్థు నుంచి మెట్లెక్కుతూ పదో అంతస్థు నుంచి లోకాన్ని చూస్తే కలిగే అనుభవం. ఒక ఏడాది రాయకపోతే మర్చిపోతారేమోనన్న భయం ఉన్న రచయితలకి ఇదంతా అనవసరం. సాహిత్యం కలిగించే పరమప్రయోజనం, నిన్ను ఉన్నతుణ్ని చెయ్యడం నుంచి దూరం కాకూడదు. మన ఆంతరిక బాహిరప్రపంచాలకి సయోధ్య ఏర్పడుతుంది. Ideology as we know it died long ago.
తెలుగు సాహిత్యంలో అన్ని ప్రక్రియల్లోను సాధికారత కలిగిన రచయితల్లో దాదాపు చివరి తరం వారు మీరు. వర్తమాన సాహిత్య రంగంలో మీవంటి రచయితలు కనిపించకపోవడానికి కారణాలేమిటి?
ఏమో గానీ, ఒకటి చెప్పగలను. సాహిత్యం, నాటకం, సినిమా, సంగీతం భిన్న కళారూపాలు. అక్షరం నదిలో పడవలాంటిది. ఒకచోటే ఉండడం ఒక అనుభవం. అట్లా తిరుగుతూ మధ్యలో ఇసుక తిన్నెలు, ఆవలితీరం, ముఖ్యంగా నది సముద్రం లో కలిసేచోట ఆగడం గొప్ప అనుభవం. భిన్న ప్రక్రియలు భిన్న సృజనాత్మకానుభవాన్ని కలిగిస్తాయి. అది నీకసలు ఉంటే మాట. రచయితకీ గుమాస్తాకీ తేడా ఉందా? లేదా? నటుడికి సాహిత్యానుభవం ఉండి తీరాలి. ఇంకోటి, విత్తనం మొలకెత్తడానికీ, అన్నం ఉడకడానికీ, తిన్నది జీర్ణం కావడానికీ కూడా సమయం పడుతుంది. వేగిరించడం కుదరదు. ఎవరికివారు ఆత్మపరీక్ష చేసుకోవాల్సిందే. అయినా ఇంత అభద్రతాభావం ఉన్నవాళ్లకి సాహిత్యం ఏవిటయ్యా?
ఇన్నేళ్ళు మిమ్మల్ని నిండుకుండలాగ నడిపించిన తాత్విక చింతన ఏమిటి?
It is a personal thing. సాహిత్యమే నన్ను బతికిస్తోంది. గాఢమైన జీవితేచ్ఛ, receive life as its comes అనే సూత్రం నన్ను నడిపిస్తూంటాయి. My life is full of upsets. నాకు నేనే ఒక ప్రశ్నల జాబితా తయారు చేసుకున్నాను. నేను పీకల దాకా కూరుకుపోయినప్పుడల్లా ఏకాంతంగా కూచుని ఆ ప్రశ్నలు వేసుకుంటాను. త్వరగానే బయటపడుతూంటాను. జీవితం అద్భుతమైన వరం. జీవనం వేరు, జీవితం వేరు. నీ కళ్లతో నువ్వు Human grandeur ని చూడ్డం ఎంత అదృష్టం. అసలు నువ్వేమిటో నీకేం కావాలో తెలిస్తే ఏ గొడవా ఉండదు. నాకు జీవితం సాహిత్యం ఒకటే. ఇస్మాయిల్‌ గారి గురించి రాస్తూ ‘ఆయన రోజూ రాత్రి మరణించి ఉదయం ఉమ్మెత్త పువ్వులా జీవిస్తా’రని అన్నాను. అది కొంత నాకూ వర్తిస్తుంది.
దేశదేశాల సాహిత్యం చదివారు కదా, మీకు ఇష్టమైన Literary Character ఏది?
కర్ణుడు. అతని అస్తిత్వవేదనతో పోల్చదగినది ప్రపంచ సాహిత్యంలో లేదు. ఇంకా ఉన్నా, ప్రత్యేకించి geeves (జీవ్స్‌) గురించి చెప్పాలి. ్P.G. Wodehouse సృష్టించిన గొప్పపాత్ర. geeves గొప్పతనం ఏమంటే మొత్తం ఇంగ్లీషు ఉన్నతవర్గాల్ని ఎగతాళి చెయ్యడం. నిర్వ్యాపారంగా అజ్ఞానంలో ఉండే బ్రిటిషు భూస్వాములన్నమాట. కేవలం హాస్యరచనలు కావవి.
సాహిత్యకారుడికి రచనాదర్శనం ఎలా కలుగుతుందో చెప్పండి?
దర్శనం అన్న పదం వల్ల చిన్న పుస్తకం రాయొచ్చు. కవికి అంతగా అవసరం లేని లోకజ్ఞత వచన రచయితకి అవసరం. ముందసలు ఏ ప్రాపంచిక దృక్పథంతో రాస్తున్నాడో అతనికి తెలియాలి.One Hundred years of Solitude గుర్తుంచుకో. వాస్తవ ప్రపంచాన్ని Chronicle చెయ్యడంతోపాటు మానవ జీవితాలకుండే ఇతర dimensions ని నిర్వచించగలగాలి. 3D. అంటే మనిషి, స్థలం, కాలం అనే వాటికి సృజనాత్మకత ఒక ప్రత్యేక ఆవరణాన్ని సృష్టిస్తుంది. అది ఒక సార్వజనీన అనుభూతిని కలగచేస్తుంది. తను ఏ జీవితపార్శ్వాన్ని చూపించదల్చుకున్నాడో ముందు రచయితకి ‘దర్శనం’ కావాలి. అది ఎట్లా జరుగుతుంది? Contemplation వల్ల. తన ప్రమేయం లేకుండా కూడా జరిగే అవకాశం ఉంది. ఇదంతా రచయిత ఆంతరిక వ్యవహారం. దీనికి నిదర్శనాలుండవు. సామాన్యంగా రచయిత outsider గా రాస్తాడు. తప్పేంలేదు. కానీ నువ్వు సృష్టిస్తున్న స్థలకాలాదుల్ని ఆంతరికం చేసుకోవడంలో నువ్వన్న దర్శనం అవుతుంది. అంతర్యానం వంటిది. ఆ స్థితిలో రచయిత కూడా ఉండడు. నోట్లో వేసుకున్న విటమిన్‌ గుళికలాగ అయిపోతాడు.
సాహిత్యానుభవం అంటే ఏమిటి? మీ సాహిత్యానుభవాన్ని వివరించండి?
ఇది కూడా సాహిత్యదర్శనంలో భాగం. సాహిత్యానుభవం అంటే అనేకానేక పుస్తకాలు చదవడం ఒక్కటే కాదు. మనిషి సుప్తచేతనలో చారిత్రక, జాతి, సామాజిక, ఆదిమ స్మృతుల పొరలుంటాయి. ఒక పదచిత్రం, ఒక పాత్ర, ప్రతీక ఆ స్మృతుల్ని చైతన్యవంతం చేస్తాయి. ఒక అలౌకికమైన అనుభూతి కలుగుతుంది. ఈ రకమైన అనుభూతి కేవలం శబ్దార్థాల వల్ల మాత్రమే కలగదు. శబ్దంతో సంబంధం లేని ప్రక్రియ. అనేక వేల జీవితానుభవాలతో నువ్వు మమేకం కావడం సాహిత్యానుభవంలో ఒక భాగం. అనేక ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది. ఆ అనుభవం వల్ల ఒక ఎరుక ఏర్పడుతుంది. సంయమనం, సమన్వయం వంటివి ఏర్పడతాయి. ఇదంతా మాటల వల్ల అర్థమయ్యే వ్యవహారం కాదు. నీ జీవితానికీ, సాహిత్యానికీ ఉండే మధ్య దూరాన్ని బట్టి ఉంటుంది.
నాటకకర్తగా దృశ్యమాధ్యమం గురించి మీ అవగాహన ఏమిటి?
ప్రేక్షకుడిగా చెప్తాను. తెలుగు సినిమా ఫార్ములా వలె పరిషత్తు నాటక ఫార్ములా ఒకటి ఏర్పడింది. పోటీలు తప్ప నాటక ప్రదర్శనలు లేకపోవడం ఒక కారణం. తెలుగు నాటకాలు అందుకే ఆలోచనాత్మకంగా ఉండవు. నటులకీ, దరిదాపు అందరు దర్శకులకీ సాహిత్యంతో సంబంధం ఉండదు. నాటక రచయితలకి కూడా మంచి సాహిత్య పరిచయం ఉండడం లేదు. బోలెడు బహుమానాలు పొందిన నాటకాలకు చదివించే లక్షణం ఉండడం లేదు. టి.వి. వచ్చిన తరువాత తెలుగు నాటకానికి ముప్పు ఏర్పడింది. మనకి గొప్ప సంగీత, నృత్య నాటకాలు లేవు. పౌరాణిక సాహిత్యం, ఇతిహాసాలు, గొప్ప చరిత్ర ఉన్న ఈ దేశంలో ఆ వస్తువుతో గొప్ప తెలుగు నాటకాలు రావడం లేదు. మీగడ రామలింగస్వామి, గుమ్మడి గోపాలకృష్ణవంటి వారు తంటాలు పడుతున్నారు. మన ప్రేక్షకులకి అభిరుచి లేకపోవడం దురదృష్టం. అందుకే మంచి సినిమాల్లేవు మనకి. అసలు కృష్ణుడనేవాడు ఒక దిక్కుమాలిన ఫ్లూటు, కిరీటం, కాయితం దండతో కనిపించినంత కాలం మంచి పౌరాణిక నాటకాలుండవు. ఒక నిజమైన పెద్ద నగరం మనకి లేకపోవడం సగం కారణం. మన ప్రభుత్వాలకి కళాసాహిత్యాల పట్ల గౌరవం, అవగాహన లేవు. వాళ్లకవి అవసరం లేదు.

 నామాడి శ్రీధర్‌, ఒమ్మి రమేష్‌బాబు
9396807070, 9848799092

0 comments:

Post a Comment